ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 21న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది పంపిణి చేసిన ట్యాబ్లతో పోలిస్తే మరింత మెరుగైన సదుపాయాలతో ఉన్న ట్యాబ్లను విద్యార్థులకు అందించనుంది జగన్ సర్కారు.
మెరుగైన సదుపాయాలతో
విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ కంటెంట్తో 5,18,740 ట్యాబ్లను పంపిణీ చేసింది. తాజాగా ఈ ఏడాది 4.30 లక్షల ట్యాబ్ల పంపిణీకి టెండర్లు పిలవగా శాంసంగ్, ఏసర్, లావా, మార్క్ వ్యూ సంస్థలు ముందుకు రావడంతో ఆయా సంస్థల నుంచి ఇప్పటికే 2.50 లక్షల యూనిట్లు విజయవాడలోని స్టాక్ పాయింట్కు చేరాయి. మరో 1.80 లక్షల యూనిట్లు ఈ వారంలో చేరనున్నాయి.
గత సంవత్సరం 8.7 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్, 64 జీబీ ఎస్డీ కార్డు గల ట్యాబ్లను ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణి చేయడంతో పాటు అదే తరగతి పాఠ్యాంశాలను అప్లోడ్ చేశారు. కానీ ఈ ఏడాది ట్యాబ్ల సామర్థ్యం పెంచి 8.7 అంగుళాల తెర, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్, 256 జీబీ ఎస్డీ కార్డు కలిగిన ట్యాబ్లను విద్యార్థులకు అందించనున్నారు. దాంతో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల బైజూస్ ఈ కంటెంట్ను సైతం అప్లోడ్ చేసారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేసేంత స్పేస్ కూడా ఈ ట్యాబ్ల్లోఉండటం విశేషం. విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పనిచేసే ‘ఈ ట్యూటర్’ను కూడా ట్యాబ్లలో అందుబాటులో ఉంచడం గమనార్హం.
విదేశీ భాషలు నేర్చుకునేలా
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేందుకు విదేశీ భాషలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉపాధ్యాయులకు కూడా వివిధ భాషల్లో శిక్షణ ఇవ్వాలని ఇటీవల విద్యాశాఖ అధికారులు హైదరాబాద్లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) అధికారులతో చర్చించి విదేశీ భాషలు అందించే యాప్ ‘డ్యులింగో’ను ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇవ్వనున్న ట్యాబ్ల్లో ఇన్స్టాల్ చేశారు. గతేడాది పంపిణి చేసిన 5,18,740 ట్యాబ్లతోపాటు ఈ ఏడాది ఇవ్వనున్న 4.30 లక్షల ట్యాబ్ల్లోనూ ఈ డ్యులింగ్ యాప్ అందుబాటులోకి రానుండడంతో విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునే వీలు కలిగింది.
గతేడాది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సెక్షన్కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను, ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 21 నాటికి 30 వేల ఐఎఫ్పీలు, 22 వేల స్మార్ట్ టీవీలను జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.