తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైద్య రంగం నిర్లక్ష్యానికి గురైంది. ప్రభుత్వాస్పత్రులు అధ్వానంగా ఉండేవి. ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదు. 108 అంబులెన్స్లను గాలికొదిలేశారు. ఇక బాబు తన పాలనలో మెడికల్ కాలేజీలపై దృష్టిపెట్టిన పాపాన పోలేదు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లో సౌకర్యాలుండేవి కాదు. దీంతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకునేవారు. జగన్ సీఎం అయ్యాక పరిస్థితి మారింది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పేదల ఆరోగ్యానికి కొండంత భరోసా లభించింది.
ఏమి చేశారంటే..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నడుం బిగించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో ఐదింటిని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాడు – నేడు కింద ప్రభుత్వ బడులను బాగుచేసినట్లే ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. మండల కేంద్రాల్లోని పీహెచ్సీలు, నియోజకవర్గ కేంద్రాల్లోని సీహెచ్సీల్లో పనులు చేపట్టారు. 53 వేల మందికి పైగా వైద్యులు, సిబ్బందిని ఈ ప్రభుత్వం కొత్తగా నియమించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని జగన్ మొదలుపెట్టారు. దీంతో గ్రామీణులకు వైద్యాన్ని మరింత చేరువ చేశారు. డాక్టర్లు నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి ఆరోగ్య సమాచారం వాకబు చేసి సేవలందిస్తున్నారు. ఇంకా వైఎస్సార్ ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 12,123 శిబిరాలు నిర్వహించి, 60.27 లక్షల మందికి ఓపీ సేవలు అందించారు. రెండో దశలో ఇప్పటి వరకు 2,838 క్యాంపులు పెట్టి 9.48 లక్షల మందికి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని జిల్లా ప్రధానాస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలందిస్తున్నారు. వృద్ధులకు రూపాయి ఖర్చు లేకుండా కంటి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి అద్దాలు ఇస్తున్నారు. శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. ఇంత చేస్తున్నా తెలుగుదేశం, ఎల్లో మీడియా ప్రభుత్వంపై ఏడుస్తూనే ఉన్నాయి. కానీ నిజం ఏంటో వైద్యసేవలు అందుకుంటున్న ప్రజలకు.. ఆదుకున్న ఈ ప్రభుత్వానికి బాగా తెలుసు.