ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక జరిగిన మొదటి ఎలక్షన్లలో తెలంగాణలో 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని మూడో స్థానంలో నిలబడింది టీడీపీ . అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అనుభవజ్నుడైన నాయకుడు అవసరం అనే ప్రచారంతో పాటు, అలవిమాలిన హామీలు, పలు పొత్తులతో ఆంధ్రాలో అధికారం చేజిక్కించుకున్నాడు బాబు
2015లో జరిగిన ఓటుకు నోటు సంఘటన చంద్రబాబుని శాశ్వతంగా హైదరాబాద్ నుంచి వెళ్లిపోయేలా చేసింది. అంతేకాదు పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కుని కూడా తెలంగాణాకి దారాదత్తం చేసి రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించాడు బాబు .
చంద్రబాబు ఆంధ్రా రాజకీయాల పైనే ఎక్కువ దృష్టిపెట్టడం, తెలంగాణలో ఎవరినీ నమ్మలేక, పార్టీ మీద పూర్తి పట్టు లేకపోవడంవలన టీడీపీ నుంచి ఒక్కొక్కరూ వెళ్లిపోయారు. తాము పెంచి పెద్ద చేసిన రేవంత్ రెడ్డి లాంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎంతగా దిగజారిందంటే 15 సీట్ల నుంచి 2018లో 2 సీట్లకు, ఆ తర్వాత 2023లో అసలు పోటీ చేయలేని దుస్థితికి దిగజారి పోయింది . మధ్యలో GHMC ఎలక్షన్లలో, కూకట్పల్లి బై ఎలక్షన్లలో కూడా చతికలబడింది. ఒకరకంగా చెప్పాలంటే టీడీపీ తెలంగాణలో కనుమరుగైందని చెప్పుకోవచ్చు.
ఇక పోతే ఓటుకు నోటు కేసు తర్వాత ఆంధ్రాకి పరిమితమైన చంద్రబాబు తన మార్కు తెలివితేటలు ప్రదర్శించసాగాడు. తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేకపోయినా ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం చెయ్యడానికి 23 మంది ఎమ్మెల్యేలని తన పార్టీలోకి లాక్కుని కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. అవి చాలవనన్నట్టు మంగళగిరిలో ఓడిన కొడుకుని అందలం ఎక్కించడానికి ఎంఎల్సీని చేసి మూడు శాఖలకు మంత్రిని చేశాడు.
ఇంతలో పవన్ కళ్యాణ్ కూడా ఎదురు తిరిగి తన మద్దతు లేదని ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలైంది. మెల్లగా ఆ బంధం తెగిపోయింది. మొదట ప్రత్యేక హోదా అవసరం అని పట్టుబట్టి, బీజేపీతో స్నేహం కారణంగా మాట మార్చి ‘హోదా వద్దు… ప్యాకేజీ ముద్దు’ అని రాగం మార్చాడు. తర్వాత 2019 ఎన్నికలకు బీజేపీతో వెళితే నష్టం అనుకొన్న బాబు ఆ బంధం తెంచుకొని మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికి ఎత్తుకొని, ధర్మ పోరాట దీక్షలు, తెలుగువాడి ఆత్మ గౌరవ సభలు పెట్టాడు. బీజేపీకి దూరం అయ్యాడు.
ఈ సంధి కాలంలో జరిగిన అమరావతి భూముల స్కామ్, జన్మభూమి కమిటీల అవినీతి, DTPస్కాంలు, Fibernet స్కాంలు, స్కిల్ డెవలప్మెంట్ స్కాం, నీరు చెట్టు పేరిట అంతులేని దోపిడీ, చినబాబు చిలక్కొట్టుడు, అన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చివరికి లోకేష్ అవినీతి చూస్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది అని పవన్ కళ్యాణ్ బహిరంగ విమర్శలు చేసాడంటే నాటి దోపిడీ ఏ స్థాయిలో ఉందో మనం ఊహించొచ్చు.
2019 ఎలక్షన్లు వచ్చాయి . అప్పటి వరకూ అధికారం అండతో అంతులేని దోపిడీ కొనసాగించటంతో పాటు అహంకారంతో తమ మిత్రపక్షాలను దూరం చేసుకుని, తమ పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఫలితాలు వెక్కిరింతగా తాము లాక్కున్న 23 మంది సంఖ్యను తలపిస్తూ కేవలం 23 సీట్లు వచ్చాయి. వైస్సార్సీపీకి తాము ఊహించినదానికంటే ఎక్కువగా 151 సీట్లు వచ్చాయి. అందులో చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ కూడా ఓడిపోయాడు. తాము ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకున్న రాజధాని ప్రాంతంలో కూడా తీవ్ర పరాభవం ఎదురైంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం.
2019 నుంచి ఇప్పటివరకూ దిశానిర్దేశం లేకుండా ఎటు గాలి తోలితే అటు వెళ్తూ వచ్చారు. ఇంతలో స్కిల్ స్కామ్తో పాటు పలు స్కామ్స్ పై విచారణ జరిగి ఆధారాలు బయట పడటంతో దాదాపు యాభై రోజులపాటు జైల్లో మగ్గిపోయాడు చంద్రబాబు . ఇదే సమయంలో తండ్రికి అండగా ఉంటూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయాల్సిన లోకేష్ తాను చేస్తున్న యువగళం యాత్ర మధ్యలోనే ఆపేసి ఢిల్లీ వెళ్లి తండ్రి బెయిల్ కోసం ప్రయత్నాల పేరుతో కొన్ని వారాలు అక్కడే మకాం వేసాడు కానీ అక్కడుంది బెయిల్ కోసం కాదు తనని కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో అనేది టీడీపీ శ్రేణులకే కాదు రాష్ట్ర ప్రజలందరికి అర్ధమైంది. చివరికి 36 అనారోగ్య కారణాలతో బాబుకి బెయిల్ మంజూరు అయ్యింది.
ఈ పరిణామాలతో టీడీపీలోని నాయకత్వ లోపం బయటపడింది. లోకేష్ పారిపోవడంతో టీడీపీలో మాట్లాడే నాయకుడు లేకుండా పోయాడు. ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని నారా భువనేశ్వరి జనాల్లోకి రావడం చాలా మందినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకొక నాయకుడు ఎవరైనా ముందుకు వస్తే నాదెండ్ల ఎపిసోడ్ రిపీట్ అవుతుందనే భయం కూడా కావొచ్చు.
ఈ దుస్థితిలో ఉన్న టీడీపీకి కొంతలో కొంత ఊరట పవన్ కళ్యాణ్ మళ్ళీ చేరిక. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షమన్నట్టు పవన్ కళ్యాణ్ పొత్తుకి సిద్దపడగానే లోకేష్, బాలయ్య సహా టీడీపీ శ్రేణులు అందరూ మాకు కొండంత అండ పవన్ అని భజన మొదలు పెట్టడంతో టీడీపీ ఎంత అభద్రతా భావంలో భయంతో కొట్టుమిట్టాడుతుందో అర్ధం చేసుకోవచ్చు . టీడీపీలోని ఈ బలహీనతని ఆధారం చేసుకొని 2024 ఎన్నికల వేళ పొత్తులో భాగంగా అధిక సీట్లు డిమాండ్ చేయవచ్చు పవన్ .
అయితే తెలంగాణ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు ఎనిమిది మందిలో ఒక్కరికి కూడా డిపాజిట్లు రాకపోవడం, అందులో పొత్తులో ఉన్న బిజెపి ఓట్లు కలుపుకొని కూడా ఏడు మందికి స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు రావడం చూస్తే ఆయన ప్రభావం ఎంత ఉండబోతుందో ఇట్టే అర్థం అవుతుంది.
ఇకపోతే ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో లోటపాట్లు దొరక్క, తప్పుల్ని పట్టి విమర్శించలేక నానా తిప్పలు పడుతున్న టీడీపీకి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కొంత ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు. ఆ గెలుపుని
కూడా తమ ఖాతాలోకి వేసుకుని సంబరాలు చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే తమ పార్టీ అభిమానులు ఎక్జువగా ఉంటే హైదరాబాద్ ప్రాంతలో BRS ఎక్కువ సీట్లు గెలవడం కొసమెరుపు.
2024 ఆంధ్రా ఎలక్షన్ల ముందు బీజేపీ పొత్తు కోసం ఎంత ప్రయత్నించినా వాళ్లు పట్టించుకోకపోవడం, జనసేన కలిసినా ఎప్పుడు విడిపోతుందో తెలియపోవడం, చంద్రబాబు తరవాత పార్టీని నడపగల సత్తా లోకేష్ కి లేకపోవడం, ఇంకెవరికైనా పార్టీ పగ్గాలు ఇస్తే నాదెండ్ల ఎపిసోడ్ పునరావృత్తం అవుతుందేమో అనే భయం నడుమ టీడీపీ పార్టీ అంపశయ్య పై ఆపసోపాలు పడుతుందని చెప్పొచ్చు.